కీలక బిల్లులపై సుదీర్ఘ చర్చ.. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్

  • మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు లోక్‌సభలో ప్రవేశం
  • బిల్లులపై 18 గంటల పాటు చర్చ జరిపేందుకు స్పీకర్ అంగీకారం
  • రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటన
  • బిల్లు ప్రవేశపెట్టే దశలోనే డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టిన విపక్షాలు
  • తొలి విడత ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 251, వ్యతిరేకంగా 185 ఓట్లు
దేశవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు సహా మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, రేపు ఓటింగ్ నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభకు తెలియజేశారు. లోక్‌సభ ముందుకు వచ్చిన ఈ బిల్లుల ప్రాధాన్యత దృష్ట్యా, వాటిపై విస్తృత స్థాయి చర్చ జరగాలని సభ్యులు కోరడంతో చర్చా సమయాన్ని పెంచుతున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026 (మహిళా రిజర్వేషన్), డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026ను సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఈ బిల్లులపై 12 గంటల పాటు చర్చ జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిపారు. అయితే, దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా, చర్చను అవసరమైతే 15 నుంచి 18 గంటల వరకు పొడిగిస్తామని, సభ్యులందరికీ మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తామని హామీ ఇచ్చారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే దశలోనే సభలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్షాలు మూజువాణి ఓటింగ్‌ను వ్యతిరేకించి, డివిజన్ (రికార్డెడ్ ఓటింగ్) పద్ధతిలో ఓటింగ్ జరపాలని పట్టుబట్టాయి. సాధారణంగా సభలో మూజువాణి ఓటుతో తీర్మానాలు ఆమోదిస్తుంటారు. కానీ, ఫలితంపై వివాదం తలెత్తినప్పుడు డివిజన్ ఓటింగ్ నిర్వహిస్తారు.

ప్రతిపక్షాల డిమాండ్ మేరకు స్పీకర్ డివిజన్ ఓటింగ్‌కు ఆదేశించారు. ఓటు స్లిప్పుల ద్వారా జరిగిన ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు పోలైనట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ సంఖ్యలో మార్పులు ఉండొచ్చని కూడా ఆయన సూచించారు. అనంతరం జరిగిన మరో రౌండ్ ఓటింగ్‌లో మొత్తం 333 మంది సభ్యులు ఓటు వేయగా, ఎవరూ తటస్థంగా లేకపోవడం గమనార్హం. ఈ ప్రక్రియతో బిల్లుల పరిచయం పూర్తవగా రేపు జరగనున్న ఓటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Kiren Rijiju
Women Reservation Bill
Parliament
Lok Sabha
Voting
Arjun Ram Meghwal
Delimitation Bill 2026
Central Territories Act Amendment Bill 2026

More Telugu News